Blog Archive

Sunday 11 April 2010

ఈనాడు (on 16-01-2010 ) సాహిత్యం నుండి సేకరించిన వివరాలు


ఇంతకీ కాలజ్ఞానంలో ఏముంది?
సాహిత్యాంశం
బ్రహ్మ మనగ వేరె పరదేశమున లేడు
బ్రహ్మ మనగ జూడు బట్ట బయలు,
తనకు తానె బ్రహ్మ తారక మౌనయా
కాళికాంబ హంస కాళికాంబ
ఈ పద్యం వినగానే వీరబ్రహ్మేంద్రస్వామి గుర్తుకొస్తారు. ఆయన్ని విష్ణువాంశగా ఎంత మంది భావిస్తారో, దత్తాత్రేయుని అంశగా కూడా అంతమంది భావిస్తారనడం తెలిసిందే. ఇప్పటికీ పల్లెల్లో ‘కాలజ్ఞానం’ ప్రస్తావన వినిపిస్తుంది. నగరాల్లో సైతం వ్యాన్లు, జీపుల్లో ‘కాలజ్ఞానం’ క్యాసెట్లు అమ్ముతూ కనిపించే దృశ్యాలు సర్వసాధారణం. అలాగే వీరబ్రహ్మేంద్ర తత్వాలు, ప్రవచనాలు అన్నీ వినిపిస్తాయి. ఈ కాల జ్ఞానాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి అనేక సందర్భాల్లో బోధించారు. కడప పట్టణం సందర్శించిన తర్వాత శిష్యుల కోరిక మేరకు చేసిన బోధాసారం ఇలా సాగుతుంది.
* కలియుగము 5,000 సంIIలు జరుగు సరికి దుష్ట నిగ్రహ శిష్ట రక్షణకు నేను మరల అవతారమునెత్తి వచ్చెదను. అప్పుడు దుష్ట నాశనమున కనేకమైన యుత్పాతములుర్విపై నుద్భవించదు. ఉప్పుగుండూరను గ్రామమునందు చెరువు కింద నుత్పాతములు పుట్టును. ఉత్తమ వైశ్యులు కొందరు ప్రమాదముల పాలై నశింతురు.
* జలప్రళయ మాసన్నమై పదునాల్గు పట్నంబులు నాశనమగును. నా రాకకు నిదర్శనమదియె. ముండ్ల పాడను గ్రామము వద్ద మునివేషధారులైన కొందరు దోపిడీలు చేసి ప్రజలను బాధింతురు.
* నాలుగు వర్ణాలవారూ న్యాయ మార్గము తప్పి అన్యాయ వర్తనులై చరించెదరు. మసిపాత కమ్ముదురు. ధాతనామ సంవత్సరమున మాఘశుద్ధ బుధవారమునాడు పట్ట పగలు పదునెనిమిది పట్నములను దొంగలు కొల్లగొట్టెదరు. తద్వారా ప్రజలు భీతావహులై బహు ఇడుమల పాలగుదురు.
* రాచపాలెపు రచ్చబండ వద్ద కొందరు చేరి ఆశపోతుల గొంతులు కోయుదురు. కొచ్చర్ల కోటలో కోడి మాటలాడును. ద్రవ్యాపహరణము అధికముగా జరుగును. ద్రవ్యాపహరణము లధికముగా జరుగును. ఆడి తప్పు వారధికమగుదురు. అధిక ప్రయాణములు... ప్రమాణములు చేయువారు లెక్కువగుదురు.
* స్త్రీ పునర్వివాహములు విరివిగా జరుగును.
* వైశ్యకులము నందు ఉత్తమ భక్తులు పాతిక గోత్రములవారు నిలతురు.
* ఉత్తర భారత దేశమున భేరికోమటి కులమందు ఉత్తముడైన వ్యక్తి గాంధి నామధేయుడుద్భవించును. సర్వ భారతము నేక త్రాటిపై నడిపించును.
* మధుర మీనాక్షమ్మ మనుషులతో మాటలాడును. నన్ను నమ్మిన వారు గుణవంతులై బనగాలిపల్లెకు చేరుదురు. నీ రాజ్యము (నవాబు రాజ్యము) శాశ్వతము కాదు.
* కారెంపూడిలో ఘనమైన బాలలుద్భవింతురు. వారి కంది మల్లాయ పల్లెకు చేరుదురు. దుర్గుణులు, దుర్మార్గులు దుర్మరణముల పాలగుదురు.
* అద్దంకి నాంచారమ్మ అందరితో మాటలాడును. అప్పుడు కొంత నష్టమగును.
* మహానంది మరుగున మహిమలుద్భవించును. నాలుగు నిలువుల పొడవు గలిగిన ఆజానుబాహువు లరుదెంచి మేమే వీరభోగవసంత రాయులమని ప్రచారము చేసికొందురు.
* వీపున వింజామరలు కలిగి, అరికాలున తామర పద్మము కలిగిన వారలు వత్తురు. పలువురు నేనే అని నమ్మి మోసపోతురు. నా భక్తులైన వారు మోసపోరు.
* నా రాకకు మరొక గుర్తు... నేను వచ్చే నాటికి కందిమల్లయ్య పల్లెలో నవరత్న మంటపము కలదు. పలువురు నేనే నని భ్రమకు గురవుతారు. నా భక్తులు నమ్మరు.
* పట్టపగలు ఆకాశం నుంచి పిడుగులు పడి అగ్ని వర్షం కురుస్తుంది. శ్రీశైలనాథుడు సాక్షాత్కరించి మాట్లాడి వెళ్తాడు. వీరభోగవసంతుడు రాబోవుచుండెనని భవిష్యవాణి వినిపిస్తాడు.
* ఎర్ర చీమ ఏనుగు రూపమున కనిపించును.
* పంది కడుపున ఏనుగు పుట్టును.
* అయిదు తలలు గల శిశువుని మేక ప్రసవించును.
* బనగానిపల్లెలో కాలజ్ఞాన పాతరపై నున్న చింత చెట్టుకి జాజిపూలు పూస్తాయి.
* కావేరీ తీరమున కలహాలు పుట్టి ప్రాణనష్టం సంభవించును. స్త్రీలు విధవలయ్యెదరు. సూర్యుడు గడగడ వణుకుతాడు భారతదేశాన్ని స్త్రీ పరిపాలిస్తుంది.
* వీరభోగవసంతుని ఆగమనానికి ముందు ఈ విపరీతాలన్నీ జరుగుతాయి. జొన్నవాడ కామాక్షమ్మ ఇందుకు విచారణ కర్తగా విచారిస్తుంది.
* కుంభకోణంలో గుడి కూలి పోవును. కుంభుని రూపం నశిస్తుంది. కంచికి పడమర గాండ్లవాని ఇంట్లో కామధేనువు పుట్టును. కంభం చెరువులో బంగారం తీయించి కందిమల్లాయపల్లెకు తెత్తురు.
* కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కార్చును. అందున కొందరు నశింతురు. పోతులూరి హరిభక్తులు జ్యోతిస్వరూపులై వస్తారు. అయిదేళ్ళ ప్రాయమున్న పసివాడు అల్లాడు పల్లె చేరును. కాళ హస్తీశ్వరుడు కళా హీనుడై కందిమల్లాయ పల్లెకు చేరును. రామానుజ మతము వారు నియమ రహితులై పాతకులై పోవుదురు.
* ఆవు కడుపులో నున్న దూడ అంతర్హితముగా గోచరమగును. పల్నాటిసీమలో ధనాధికులు అహంకారముతో మ్రగ్గుదురు. చాతుర్వర్ణముల వారు అన్యాయ వర్తనులై నడిచెదరు.
* బందరు పట్టణములోని భాగ్యములు బయటకు తీయుదురు. గొడ్రాళ్ళు సంతానవంతులగుదురు. (లింగాపురం నందు బంగారు ప్రతిమ ప్రజలచే అభివృద్ధి కలిగి యుండును- అంటే టెస్ట్‌ ట్యూబు బిడ్డల ఉత్పత్తి.
* కంభం చెరువు వద్ద కోడి మనిషి వలె మాట్లాడును. రాజాధిరాజులు రాజ్య భ్రష్టులై పోదురు. ఇదియే నా రాకకు నిదర్శనము. నేను నుడివిన విషయములన్నియు తప్పక జరిగితీను.
వీర బ్రహ్మేంద్రస్వామి కందిమల్లాయపల్లెలో చేసిన కాలజ్ఞానం బోధ
* శ్రీ ముఖనామ సంII ప్రాంతంలో వీరభోగ వసంతరాయుడనై వచ్చి దుష్టశిక్షణ శిక్షరక్షణ చేస్తాను.
* నేను వచ్చేనాటికి విప్రులు వర్ణసంకరులై, దురాచారులై, అపూజ్యులై ఉంటారు.
* మన్నెపురాజులు మారిపోయెదరు. పాపపు జనులు అభివృద్ధి చెంది ద్రవ్య కాంక్షచే పరమాత్ముని నిరసిస్తారు.
* దేవ బ్రాహ్మణ వంశ సంభూతులైన విశ్వకర్మ వంశ బ్రాహ్మణులు గత వైభవమును తిరిగి సంపాదించుకొని పూర్వాచారాలు పాటిస్తారు.
* కృష్ణవేణి ఉప్పొంగి కనకదుర్గమ్మ ముక్కెర తాకును. అనేక మంది అసువులర్పిస్తారు.
* శూద్రులు కేళీ విలాసములతో విచార రహితులై యుందురు. మహాలక్ష్మి నృత్యము చేయుచు అరుదెంచి- మూడు వానరములచే నాట్యమాడించును.
* వర్ణములన్నియు సంకరములగును.
* మహానందికి ఉత్తర భాగమందు అనేక మంది మునులు పుట్టుకొని వచ్చి మాయలు ప్రదర్శింతురు. తెల్లని గుడ్డ దేశమందు తేలికగా కనిపించును. తెల్ల కాకులు ఊరి పొలిమేర్లలో పడి కావు కావు అని అరచును.
* నన్ను నమ్మిన వారికి నా దర్శన భాగ్యము లభించును. జితేంద్రియులు కానట్టివారి రక్తముతో భూమి తడుస్తుంది. దుర్మార్గుల రక్తం ప్రవహిస్తుంది.
* వినాయక నంది, సోమనంది మధ్యన పాళెగాండ్రు గుడారములు నిర్మించుకొని అయిదు దినంబులుందురు. చీమ బెజ్జములలోనికి చోరులు దూరుదురు. స్త్రీలు కొందరు దుర్బుద్ధితోనుందురు.
* కందనూరు వారు పర్వతాలకు వలస పోతారు. గడగ్‌, లక్ష్మీపురం, రాయచూరు, చంద్రగిరి, ఆదవేణి, అరవరాజ్యము, వెలిగోడు, మొరసరాజ్యము, అన్నేనగరము, పున్నాళి, ఓరుగల్లు, బరిగె గోలకొండ మొదలగు దేశాలు అభివృద్ధి చెందుతాయి.
* ప్రభవనామ సంవత్సరాన రామధర్మజుల కీరి విస్తారమగును. నా మఠమందు దొంగలు పడుదురు. క్షత్రియులు నశింతురు.
* ఉత్తర దేశమునందు గాంధియను ఉత్తమ వైశ్యుడొకడుద్భవించును. మహాత్ముడై సకల మతముల వారి మన్ననలు పొందును. ధర్మము స్థాపించును.
* కందనూరు నీట కలసి పోవును. మహమ్మదీయులు, బోయలు, మరికొన్ని ఇతర జాతులవారు యుద్ధాలలో హతులగుదురు. ఏలూరులో మహాతోరణాలు పడి మరి కొందరు ప్రజలు మరణించెదరు. బాణవర్షముచే మరి కొంతమంది మడిసెదరు.
చివరిసారిగా మహాసమాధి ప్రవేశానికి ముందు వీరబ్రహ్మేంద్రస్వామి చేసిన కాలజ్ఞాన బోధ ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. ఆ వివరాలు తర్వాత చూద్దాం.
- చీకోలు సుందరయ్.

No comments:

Post a Comment