Blog Archive

Sunday 11 April 2010

బ్రహ్మం గారి జీవిత చరిత్ర & కాలజ్ఞానం





తెలుగునాట బ్రహ్మంగారి గురించి కానీ ఆయన కాలజ్ఞానం గురించి కాని తెలియని వారు లేరనే చెప్పాలి. ఆయన భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంధాలలో రచించి భద్రపరచారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. ఇలా చెప్పినవారు ప్రపంచమంతా లేకపోలేదు పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో అనేక పేర్లు వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం. ఆయన తన సమాధి తిరిగి తెరవబడుతుందని ఒక ఫలకం మీద వ్రాసి ఆ ఫలకంలో కాలనిర్ణయం చేయబడింది. ఖచ్చితంగా అదే రోజు సమాధి తెరవబడటం విశేషం[ఆధారం కోరబడినది]. ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలానే మర్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయ పరచుకుంటారు.

బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి. అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు గాంధి మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచింపబడింది. ఆంగ్లేయ మరియు మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక మరియు రాజకీయ పరిణామాలు సూచింప బడ్డాయి. ప్రకృతి ప్రకోపాలు వింతలూ చోద్యాలు బాబాల రాక అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురికావడం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి. ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదేపదే పునరుద్ఘాటించాడు. ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు సూచింప బడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకు కష్టమే. ఆయన తన 175వ ఏట[ఆధారం కోరబడినది] జీవసమాధి చెందారు. ఆయన తన కుమారునితో చేసిన సమాధి ప్రస్థావనలో తన వయసు సూచించారు. జీవ సమాధి చెందిన తరవాత ఆయన ప్రియ శిష్యుని దుఃఖం నివారణ నిమిత్తం తిరిగి కనిపించి శిష్యునికి కమండలం, దండం, పాదుకలు మరియు ఉంగరం బహూకరించాడు.

విషయ సూచిక
1 కాలజ్ఞానం శైలి
2 ఇప్పటి వరకు జరిగినవి
3 జననం
3.1 తల్లికి చేసిన జ్ఞానబోధ
4 కాలజ్ఞాన రచన
5 అన్నాజయ్యకు జ్ఞానబోధ
6 బనగానపల్లె నవాబుకు జ్ఞానభోద
7 దేశాటన
8 వివాహం
9 హైదరాబాదు పర్యటన
10 సిద్దయ్య
11 తిరుగు ప్రయాణం
12 బ్రహ్మంగారిపై ఆరోపణ
13 కక్కయ్య
14 విశ్వబ్రాహ్మణులకు తత్వోపదేశం
15 కడపనవాబు
16 పుష్పగిరి
17 పంచాననంవారికి జ్ఞానబోధ
18 గతజన్మ వృత్తాంతం
19 కర్నూలు నవాబుకు జ్ఞానబోధ
20 పుత్రుడు గోవిందాచార్యులకు జ్ఞానబోధ
21 భార్య గోవిందమ్మకు జ్ఞానబోధ
22 సమాధి తర్వాత దర్శనం
23 కందిమల్లయపాలెం చింతచెట్టు
24 ఇవికూడా చూడండి
25 మూలాలు


కాలజ్ఞానం శైలి
వీర బ్రహ్మేంద్ర స్వామి కాల జ్ఞానాన్ని వివిధ శైలులనఉ ఉపయోగించి కూర్చారు, అందులో[శ్లోకము| శ్లోకాలు],పద్యాలు, వచనం మొదలైనవి.

ఇప్పటి వరకు జరిగినవి
నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు (విద్యుత్ శక్తి) (నీటీతొ జనరేటరు)
ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి. (యంత్ర వాహనాలు)
కాశీ పట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది.
ఒక అంబ (వితంతువు) 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. (ఇందిరా గాంథి)
తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. (చలన చిత్రాలు)
రాచరికాలు,రాజుల పాలనా నశిస్తాయి.
ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేకమంది మరణిస్తారు. (విమాన ప్రమాదాలు)
జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది.
బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి.
హైదరాబాదులో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారు. (మత కలహాలు)
దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమౌతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి.
చిత్రవిచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావుపుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు.
రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి.
గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు.(లాల్ బహుద్దూర్ శాస్త్రి)
కపట యోగులు విపరీతంగా పెరిగి పోతారు. వీరివలన ప్రజలంతా మోసపోతారు.
జననం
బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన కర్నూలు జిల్లాలో బనగాన పల్లెలో జన్మించారు. ఆయన జీవితకాల నిర్ణయం సరిగా లేకున్నా క్రీస్తు శకం 1500-1610 మద్య కాలం ఉండవచ్చని అంచనా[ఆధారం కోరబడినది]. ఆయన తండ్రి పేరు వీర భోజ్యరాయలు తల్లి పేరు పాపమాంబ. చిన్న వయస్సులోనే విశేష జ్ఞానం లభించింది. ఎక్కువ ఆత్మచింతన మితభాషణం అలవడింది. ఆయన తండ్రి మరణానంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించి తన ఎనిమిదవ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానభోద చేశాడు. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని దానిని వదలమని తల్లికి హితవు చెప్పి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరాడు.

తల్లికి చేసిన జ్ఞానబోధ
బ్రహ్మంగారికి ఆదిశంకరులులా దేశాటన ద్వారా జ్ఞాన సంపాదన చేసి దానిని ప్రజల వద్దకు చేర్చడం అంటే మక్కువ ఎక్కువ. ఆయన తన మొదటి జ్ఞానబోధ తల్లితో ప్రారంభించాడు.

శరీరం పాంచభౌతికమని ఆకాశం, గాలి, అగ్ని, పృధ్వి, నీరు అనే అయిదు అంశాలతో చేయబడిందని సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాలద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని వీటి ద్వారా నేను అనే అహం జనిస్తుందని ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని బుద్ధి జీవుని నడిపిస్తుందనీ బుద్ధిని కర్మ నడిపిస్తుందని దానిని తప్పించడం ఎవరికీ సాద్యపడదనీ, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద శలవు తీసుకుని దేశాటనకు బయలుదేరాడు.

కాలజ్ఞాన రచన
బ్రహ్మంగారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చూసేందుకై తిరుగుతూ బనగానపల్లెకు వచ్చి పగలంతా తిరిగి రాత్రికి ఒకైంటి అరుగు మీద విశ్రమించి అక్కడే నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారిన తరవాత ఇంటి యజమానురాలైన అచ్చమ్మ ఆయనను ప్రశ్నించి ఆయన ఏ దైనా పని కోసం వచ్చానని చెప్పటంతో ఆమె ఆయనకు పశువులను కాచే పనిని అప్పగించారు. పశువులను కాచే నిమిత్తం రవ్వలకొండ చేరిన ఆయన అక్కడి ప్రశాంత వాతావరణంచే ఆకర్షించబడి అక్కడే ఉన్న ఒక గుహను నివాసయోగ్యం చేసుకుని కాలజ్ఞానం వ్రాయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో ఆయన గోవులకు ఒకావలయం ఏర్పరిచి దానిని దాట వద్దని ఆజ్ఞాపించడంతో అవి ఆవలయం దాటకుండా మేతమేస్తూ వచ్చాయి. ఒక రోజు ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమాంబ ఆయన ఏకాగ్రతగా వ్రాయడం పశువుల ప్రవర్తన గమనించి ఆయన ఒక జ్ఞాని అని గ్రహించింది. అచ్చమ్మ ఇన్ని రోజులు ఇది గ్రహించకుండా ఆయన చేత సేవలు చేయించుకున్నందుకు మన్నించమని వేడగా ఆయన నాకు దూషణ భూషణలు ఒకటేనని నీవైనా అయినా తల్లి అయినా తనకు ఒకటేనని ప్రంపంచంలోని జీవులన్నీ తనకు ఒకటేనని చెప్పాడు. ఆ తరువాత అచ్చమ్మ తనకు జ్ఞానభోద చేయమని కోరగా ఆమెకు యాగంటిలో జ్ఞానభోద చేసాడు.

ఆ సందర్భంలో అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు అడిగింది.

అచ్చమ్మ:- పరమాత్మ ఎక్కడ ఉన్నాడు?
బ్రహ్మంగారు:- పరమాత్మ నీలో నాలో ఈ పశువులలో అన్నిటా ఆయన ఉనికి ఉంటుంది.
అచ్చమ్మ:- ఆయనను ఎలా తెలుసుకోగలం?
బ్రహ్మంగారు:- అనేక మార్గాలున్నప్పటికీ భక్తి, ధ్యాన మార్గాలు శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే పరమాత్మను తలచుకుంటూ గడపడం. ధ్యానమార్గంలో ప్రాణాయామం లాంటి వాటి ద్వారా పరమాత్మను గురించి తెలుసుకోవడం.
అచ్చమ్మ:- ఆయన స్త్రీయా పురుషుడా?
బ్రహ్మంగారు:- ఆయన నిరాకారుడు, నిర్గుణుడు వర్ణనకు అతీతుడు.
ఇలా చెప్పి వీటిని ఏకాగ్రతతో ధ్యానించమని చెప్పి తరవాత కాలజ్ఞానం గురించి చెప్పాడు. ఆయన అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తారు.

వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి ఔతారు. మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానం ఔతుంది.
రాజులు తమ ధర్మాన్ని మరచి విందులూ వినోదాలలో మునిగి ధర్మ భ్రష్టూలౌతారు.
శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం ఔతారు.
పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది.
బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించటం వలన దేశం కల్లోలితమౌతుంది.
చోళమండలం నష్టాలపాలౌతుంది.
వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు.
ప్రజలు కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారు.కొడలు మండుతాయి.
జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులూ అలాగే చస్తాయి.
దుర్మార్గులు రాజులౌతారు. మంచి ప్రవర్తాన కలవారు భయంకర కష్టాలపాలై హీనంగా మరణిస్తారు.
మతకలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు.
అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.
నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు.
ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు.
మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు.
పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువౌతాయి.
ఒకరి భార్యను ఒకరు వశపరచుకుంటారు. స్త్రీ పురుషులిర్వురూ కామపీడితులౌతారు.
వేంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు.
ఐదువేల ఏళ్ళ తరవాత కాశీలో గంగ కనిపింకుండా మాయమై పోతుంది.
చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమౌతాయి.
కృష్ణానది మద్య బంగారు తేరు పుడుతుంది. అది చూసినవారికి కండ్లు పోతాయి.
ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది.
ఐదువేల ఏళ్ళ తరువాత నేను వీరభోగ వసంతరాయలుగా అవతరించి ధ్ర్మాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు.
వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు.
కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి.
తూర్పు నుండి పడమరకు ఒక యోజనము ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనపడుతుంది.
అన్నాజయ్యకు జ్ఞానబోధ
ఎంతో మందిమార్బలం ఉన్నా రాజులు సర్వనాశనమైపోతారు.గ్రామాలలో చోరులు పెరిగిపోతారు.
పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి.
విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు.
రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తామ చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి.
శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులుండి మేకలా కూసి మాయమౌతుంది.
శ్రీశైలంలో అగ్ని వర్షం పుడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న(నందీశ్వరుడు)రంకెలు వేస్తాడు ఖణ ఖణమని కాలు దువ్వుతాడు.
సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్ధం వినపడుతుంది.
విషవాయువు కొట్టినప్పుడు శివునికంట నీరు కారుతుంది.
గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వానకురుస్తుంది.
సూర్య్డు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు.
అతడు నేనే దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు.

నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది.
బనగానపల్లె నవాబుకు జ్ఞానభోద
బనగానపల్లె నవాబు బ్రహ్మంగారి గురించి విని ఆయన నిజంగా మహిమాన్వితుడో కాదోనని స్వయంగా తెలుసుకోవాలని ఆయనను తన వద్దకు పిలిపించాడు.వారు రాగానే స్వయంగా స్వాగతంచెప్పి ఆయనను ఆసీనులను చేసారు. స్వామివారికి ఫలహారాలు తీసుకురమ్మని సేవకుని ఆజ్ఞాపించాడు.అయినా ఆయనకు మాంసాహారం తీసుకురమ్మని సేవకునికి ముందుగానే సూచన చేసాడు.నవాబు ఆదేశానుసారం సేవకుడు మాంసాహారం నింపిన పళ్ళెరాన్ని బ్రహ్మంగారి ముందు ఉంచాడు.ఆయన పళ్ళెరం పైనున్న వస్త్రాన్ని తొలగిస్తే ఫలహారం స్వీకరిస్తానని చెప్పగా సేవకుడు అలాగే చేసాడు.ఆపళ్ళెంలోని మాంసాహారం పుష్పాలుగా మారటం అక్కడి వారిని ఆశ్చర్యచకితులను చేసింది.ఈ సంఘటనతో నవాబుకు ఆయన మహిమలపై విశ్వాసంకుదిరి ఆయనను పలువిధాల ప్రశంసించారు.ఆ సందర్భంలో బ్రహ్మంగారి నవాబు సమక్షంలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు చెప్పాడు.ఆతరవాత నవాబు ఆయనకు డెబ్బై ఎకరాల భూమిని దానంచేసి దానిని మఠం నిర్వహణకు ఉపయోగించవలసినదిగా కోరి ఉచిత మర్యాదలతో సత్కరించి సాగనంపారు.

విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది.అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది.అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి.
ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి.ఆధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు.జనులు అరచి అరచి చస్తారు.
కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవుకూడా మిగలదు.
బనగాన పల్లె నవాబు పాలనకూడా క్రమంగా నాశనమౌతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.
దేశాటన
ఆపై ఆయనకు దేశాటన చేయాలని కోరిక కలగటంతో శిష్యులకు నచ్చచెప్పి దేశాటనకు బయలుదేరాడు.ఆసమయంలో కడప జిల్లాలో పర్యటిస్తూ కందిమల్లయ పాలెం చేరుకున్నాడు.ఆ ఉరు ఆయనను ఆకర్షించడంతో అక్కడ నివాసం ఏర్పరుచుకుని మామూలు వడ్రంగిలా జీవించడం ప్రారంభించారు. గ్రామంలో అమ్మవారి జాతర కొరకు చందా ఇవ్వమని పెద్దలు ఆయనను కోరగా తాను పేదవాడినని ఏమీ ఇవ్వలేనని బదులిచ్చాడు.వారు ఆయనను చులకనచేసి మాట్లాడగా ఆయన తాను ఏదైనా ఇస్తానని కానీ అమ్మవారి గుడిదగ్గర ప్రజల సమక్షంలో మాత్రమే తీసుకోవాలని కోరాడు.వారు అందుకు సమ్మతించి అమ్మవారి గుడి దగ్గరకు అందరూ చేరారు.అందరి మూదు గుడి ముందు నిలబడి ఒక చుట్ట చేత పట్టుకుని అమ్మవారిని ఉద్దేశించి 'పోలేరీ చుట్టకు నిప్పు పట్టుకునిరా ' అని కోరగానే అదృశ్యరూపంలో అమ్మవారు ఆయనకు నిప్పు అందించగా ఊరివారు దిగ్భ్రాంతి చెంది ఆయనను గౌరవించడం మొదలుపెట్టారు.ఆయన వారికి ధర్మబోధ చేయడం మొదలు పెట్టారు.ఇలా ఆయన గురించి చుట్టూ ఉండే ప్రదేశాలకు తెలిసి రావడంతో వారు ఆయనకోసం తరలి రావడం మొదలుపెట్టారు.

కొంతకాలం తరవాత బ్రహ్మంగారి కందిమల్లయపాలెం విడిచి తిరిగి దేశాటన సాగించాడు.అలా పెద కామెర్ల అనే ఊరు చేరుకుని అక్కడ నివసించసాగారు. ఆయన అక్కడ సామాన్య జీవితం ప్రారంభించారు.ఆ ఊరిలో ఒక భూస్వామి వ్యాధి బారినపడి మరణించగా ఆయనను శ్మశానానికి తీసుకు వెళుతున్న సమయంలో బ్రహ్మంగారు తన ఇంటి ముంగిట నుండి చూసి 'ఏమైందని' అని అడిగాడు.వారు 'అతడు మరణించాడు స్మశానానికి తీసుకు వెళుతున్నాం ' అని బదులు చెప్పారు.కానీ బ్రహ్మంగారు 'ఇతడు మరణింలేదుకదా ఎందుకు తీసుకు వెళ్ళడం ఇతనిని దింపుడు కళ్ళెం వద్ద దించండి' అని చెప్పి వారి వెంట వెళ్ళాడు.వారు ఆయనపై అవిశ్వాసంతోనే దింపుడు కళ్ళం వద్ద దింపారు.అప్పుడు బ్రహ్మంగారు భూస్వామి శరీరాన్ని తల నుండి పాదం వరకు చేతితో స్పృసించగానే ఆయన జీవించాడు.అది చూసిన వారంతా ఆయనపట్ల భక్తి ప్రదర్శించడం మొదలు పెట్టారు.

బ్రహ్మంగారు చేసిన మహిమలను విశ్వసించని కొందరు ఆయనను ఎగతాళి చేసే ఉద్దేశ్యంతో సజీవంగా ఉన్న వ్యక్తిని పాడె మీద తీసుకు వచ్చి 'ఇతనికి ప్రాణం పోయండి 'అని వేడుకున్నారు.బ్రహ్మంగారు ధ్యానంలో నిజం తెలుసుకుని 'మరణించిన వ్యక్తికి ఎలా ప్రాణం పోయగలను' అని బదులిచ్చాడు. వెంటనే పాడె మీదున్న వ్యక్తి మరణించడం అందరిని ఆశ్చర్యచకితులను చేసింది.వారు బ్రహ్మంగారిని మన్నించమని వేడగా ఆయనవారికి బుద్ధిమతి చెప్పి మరణించిన వ్యక్తి తలని చేతితో స్పృజించి ఆతనిని సజీవుని చేశారు.ఆతరవాత అక్కడి ప్రజలు ఆయనను దేవుడిలా కొలవసాగారు.ఊరి ప్రజల కోరికపై ఆయన వారికి జ్ఞానబోధ చేయడం ప్రారంభించారు.

వివాహం
బ్రహ్మంగారి బోధలు విని కందిమల్లయపాలెంలోని ప్రజలు ఆయన అనుచరులుగా మారారు.ఆ ఊరిలోని కోటా చార్యులనే విశ్వబ్రాహ్మణుడు ప్రారంభంలో బ్రహ్మంగారిని నమ్మకపోయినా తరవాత నమ్మకం ఏర్పడి తనకుమార్తెను ఆయనకు ఇచ్చి వివాహం చేస్తానని కోరాడు.అందుకు బ్రహ్మంగారు అంగీకారం తెలపాడు.వివాహానంతరం కొంతకాలం ఆయన భార్యతో జీవిస్తూ శిష్యులకు జ్ఞానబోధ చేసాడు.

కొంత కాలం తరవాత ఆయన తిరిగి దేశాటనకు బయలుదేరాడు.ఆయన ముందుగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించి రాజమండ్రి వరంగల్ లో పర్యటించి హైదరాబాదు చేరాడు.

హైదరాబాదు పర్యటన
హైదరాబాదు నవాబు బ్రహ్మంగారిని గురించి తెలుసుకొని ఆయన కొరకు కబురు పంపగా బ్రహ్మంగారు నవాబు వద్దకు వెళ్ళాడు.మొందుగా నవాబు ఆయనతో 'మీరు జ్ఞాని అయినా దైవాంశసంభూతుడుగా నమ్మలేనని ఏదైనా మహిమ చూపితే విశ్వసించగలనని 'అని పలికాడు.బ్రహ్మంగారు వెంటనే ఒక గిన్నెలో నీళ్ళు తెప్పించమని కోరాడు.సేవకుడు తీసుకువచ్చిన నీటితో దీపం వెలిగించాడు.అది చూసిన నవాబు విశ్వాసం కుదిరిందని జ్ఞానబోధ చేయమని కోరాడు.నవాబు కోరికపై బ్రహ్మంగారు జ్ఞానబోధ చేసాడు.

సిద్దయ్య
బ్రహ్మంగారు వైదిక మతావలంబీకులైనా కులమతాలకు అతీతంగా వ్యవహరించాడు.స్త్రీల పట్ల ఆదరణను ప్రదర్శిస్తూ తన భావాలను వెలిబుచ్చాడు.అలాగే దూదేకుల కులానికి చెందిన సైదులను తనశిష్యునిగా చేసుకున్నాడు.ఆయన ఉన్నత భావాలను భక్తి శ్రద్ధలను మెచ్చుకుని తన ప్రీశిష్యుని చేసుకుని ఆయనకు అనేక ఉన్నత భోదలు చేసాడు.ఆయన జ్ఞానంలభించినవాడని ప్రశంశించి జ్ఞానంసిద్దించింది కనుక సిద్దయ్యగా నామకరణం చేసాడు."సిద్ధా" అనే మకుటంతో కొన్ని పద్యాలను అసువుగా చెప్పాడు. బ్రహ్మంగారి శిష్యులకు సిద్ధయ్యపై కించిత్తు అసూయ ఉండటం గ్రహించి దానిని పోగొట్టి సిద్దయ్య గురుభక్తిని చాటటానికి ఒక సారి తన శిష్యులందరిని పిలిచి చనిపోయి కుళ్ళి దుర్గంధ భరితమైన కుక్క మాంసాన్ని తినమని శిష్యులందరికి ఆదేశించాడు మిగిలిన శిష్యులందరూ దానికి నిరాకరించగా సిద్దయ్య మాత్రం భక్తిగా దానిని భుజించాడు.ఆ తరవాత బ్రహ్మంగారు మిగిలిన శిష్యులకు సిద్ధయ్య భక్తి ఎలాంటిదో వివరించాడు.అనేక విశిష్ట జ్ఞానబోధలు సిద్దయ్యకు ప్రత్యేకంగా చేసాడు.

తిరుగు ప్రయాణం
బ్రహ్మంగారు హైదరాబాదులో కొంతకాలం ఉండి తిరుగు ప్రయాణానికి ఆయత్తమయ్యారు.శిష్యబృదంతో రోజంతా ప్రయాణించి అలసిపోయి ఒక ప్రదేశంలో విశ్రమించారు.ఆయన తన సిశిష్యుడైన వెంకటయ్యనుద్దేశించి 'కొంత సమయంలో ఒక అద్భుతం జరగపోతుంది' అని యదాప్రకారం సంభాషించసాగారు. అక్కడికి కొంత దూరంలో ఏవోమాటలు వినిపించగా అది ఏమిటో తెలిసుకొని వద్దాం రమ్మని శిష్యులతో అక్కడికి వెళ్ళగా అక్కడ ఒక బ్రాహ్మణ స్త్రీ కుష్టువ్యాధిగ్రస్తుడైన భర్త శరీరాన్ని ఒడిలో పెట్టుకొని రోదిస్తూ కనపడింది.బ్రహ్మంగారు ఆమెనడిగి వ్యాధి వివరాలు కనుక్కొని ఆ స్త్రీకి ఊరట కలిగిస్తూ 'మీ గత జన్మ పాపం వలన ఇది సంక్రమించింది నేను మీకు పాపవిముక్తి చేస్తానని చెప్పి బ్రాహ్మణ యువకుని చేతితో తడిమాడు.వెంటనే అతనికి వ్యాధి మాయం అయింది.వారు ఆయనను కొనియాడి తమ ఊరికి వచ్చి జ్ఞాన బోధ చేయమని కోరగా ఆయన తగిన సమయం వచ్చినప్పుడు వస్తానని వారిని పంపి వేసాడు.

బ్రహ్మంగారిపై ఆరోపణ
ఒకరోజు బ్రహ్మంగారికి కడపనవాబు నుండి ఒక లేఖ వచ్చింది.అందులో పీరు సాహెబ్ తనకుమారుడైన సిద్దయ్యను బ్రహ్మంగారు ప్రలోభపెట్టి హిందుగా మార్చాడని ఆరోపణ చేసినందువలన విచారణ నిమిత్తం బ్రహ్మంగారిని రమ్మని నవాబు పంపిన ఆదేశం ఉంది. బ్రహ్మంగారు ఒంట్రిగా నవాబును కలుసుకునేందుకు బయలు దేరగా సిద్దయ్య ఇది తనకు సంబంధించిన విషయంకనుక తాను వెళతానని చెప్పి తాను సేవకులతో బయలుదేరాడు. మార్గమద్యంలో సేవకులకు తెలియకుండా బయలుదేరి ముందుగా కడపచేరుకుని ఊరి బయట బసచేసాడు.అక్కడ ఆయన ధ్యానంచేస్తూ తనదగ్గరకు అధికంగా వచ్చే మహమ్మదీయ భక్తులకు జ్ఞానబోధచేస్తూ వారి వేషధారణ మార్చి కాషాయ దుస్తులు రుద్రాక్షలు తిలకధారణ చేయిస్తూ వచ్చాడు.ఇది తెలుసుకున్న నవాబు కుపితుడై సిద్దయ్యను తన వద్దకు రమ్మని ఆదేశం పంపాడు.ఆదేశంపై వచ్చిన సిద్దయ్య నిర్భయత్వానికి నవాబు ఆగ్రహించి 'మహమ్మదీయుడివై హిందువుని ఆశ్రయించి నీ మతన్ని అవమానించావు కనుక నీవు శ్క్షార్హుడివి ఇందుకు నీ జవాబేమిటి 'అని గద్దించాడు.జవాబుగా సిద్దయ్య చిరునవ్వు నవ్వగా అది చూసి నవాబు మరింత ఆగ్రహించి 'నీకు మహిమలు తెలుసుకదా అవి చూపు లేకుంటే కఠిన శిక్ష వేస్తాను 'అన్నాడు.జవాబుగా సిద్దయ్య 'గురువుగారి ఆజ్ఞ లేనిదే మహిమ చూపకూడదు కాని తప్పని సరి పరిస్తితిలో గురువుగారి మహిమ చూపటానికి ఒకటి ప్రదర్శిస్తాను. మీరు పెద్ద బండ రాయిని తెప్పించండి' అన్నాడు.సిద్దయ్య అక్కడి వారికి ఆపద కలగకూడదని ఖాళీ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆబండను పెట్టించి గురువుగారిని తలచుకుని సలాం చేశాడు.వెంటనే ఆబండ ముక్కలైంది.నవాబు తన తప్పు తెలుసుకొని జ్ఞానబోధ చేయమని కోరగా సిద్దయ్య అది తనపని కాదని తన గురువుగారు తగిన సమయం వచ్చినప్పుడు చేస్తారని చెప్పి తిరిగి వెళ్ళాడు.

కక్కయ్య
బ్రహ్మంగారు తనశిష్యుడు సిద్దయ్యకు యోగవిద్య కుందలినీశక్తి శరీరంలోని యోగచక్రాలు గురించి వివరిస్తూ శరీరం ఒకదేవాలయమని అందులో దేవతలుంటారని కుండలినీ శక్తిని జాగృతం చేయడం ద్వారా వారిని దర్శించవచ్చని వివరిస్తుండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా విన్నాడు.కక్కయ్య శరీరంలోని అద్భుతాలు చూడాలన్న ఆతురతతో ఇంటికి వెళ్ళాడు.ఇంట్లో అతని భార్య నింద్రించడం చూడగానే ఆమె శరీరంలో దేవతలను చూడాలని ఆమెను ముక్కలుగా నరికి వేశాడు.అయినా ఆమెశరీరంలో రక్తమాంసాలు తప్పఏమీ కనిపించకపోవడంతో తానను బ్రహ్మంగారి మాటలు మోసపుచ్చాయని విలపించాడు.ఆయన మాటలు నమ్మి భార్యను నరికివేసానని బ్రహ్మంగారు దీనికంతా కారణమని ఆయన దొంగ అని అందరికీ చెప్పాలని అనుకున్నాడు. ముందుగా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను అడగాలనుకుని బ్రహ్మంగారి దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పి ఆయనను దూషించడం మొదలుపెట్టాడు. బ్రహ్మంగారు కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపడి వెంటనే 'కక్కా నేను చెప్పింది అసత్యం కాదు నేను అసత్యం పలకను నిదర్శనంగా నీ భార్యను బ్రతికిస్తాను ' అనిచెప్పి అతని వెంట అతని ఇంటికి వెళ్ళి అతనిభార్య శరీరంపై మంత్రజలం చల్లగానే ఆమె నిద్ర నుంచి మేల్కొన్నట్లు లేచి కూర్చుంది.కక్కయ్య బ్రహ్మంగారి మహిమ తెలుసుకుని ఆయనను మన్నించమని పలు విధాల వేడుకుని తనను శిష్యుడిగా చేర్చుకొనమని తాను వెంట నడుస్తానని బ్రహ్మంగారిని వేడుకున్నాడు.బ్రహ్మంగారు ఎవరూ 'నన్ను పూజించవద్దు నాశిష్యులెవరూ నన్ను పూజించరు దేవుడిని అన్వేషిస్తారు అదే అందరికి ఆమోదయోగ్యము నువ్వు కూడా అదే పని చెయ్యి ' అని చెప్పి తిరిగి వెళ్ళాడు.

విశ్వబ్రాహ్మణులకు తత్వోపదేశం
బ్రహ్మంగారు యధావిధిగా దేశాటనకు బయలుదేరి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ నండ్యాల సమీపంలోని ఒకగ్రామంలో భోజనార్ధం విశ్రాంతి తీసుకుంటూ దాహం కోసం ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటి ముంగిట నిలబడి మంచి నీళ్ళు ఇమ్మని అడిగాడు.అతను పనిమీద నిమగ్నమై నీళ్ళు ఇవ్వడం కుదరదని ప్రక్కనే ఉన్న బాలో చేదుకుని త్రాగమని చెప్పాడు.బ్రహ్మంగారు వినకుండా నీళ్ళు కావాలని తిరిగి అడిగాడు.విశ్వబ్రాహ్మణుడు ఆగ్రహించి కరుగుతున్న లోహం తీసుకువచ్చి త్రాగమని అన్నాడు.బ్రహ్మంగారు మారు పలుకక ఆలోహ ద్రవాన్ని త్రాగి వేసాడు.అది చూసిన విశ్వబ్రాహ్మణుడు భయపడి తాను అపరాధంచేశానని క్షమించమని వేడుకున్నాడు.అందుకు బ్రహ్మంగారు "నాకు అజ్ఞానం మీద తప్ప ఎవరిమీద కోపం లేదు" అని చెప్పాడు.ఆతరవాత ఆ విశ్వబ్రాహ్మణుని కోరికపై ఆతిధ్యం స్వీకరించి బయలుదేరి కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని నంద్యాల చేరుకున్నాడు.నంద్యాలలోని ప్రజలు బ్రహ్మంగారికి బోజనవసతులు కల్పించి ధర్మ బోధవిని ఆనందించారు.నంద్యాలలో విశ్వబ్రాహ్మణులను పంచాననం అనేవారు.వారు ఆ కాలంలో కొంత అహంభావంతో ప్రవర్తించేవారు.వారి సహాయార్ధం వచ్చేవారిని చులకనచేసి ఎగతాళి చేసేవారు.బ్రహ్మంగారు వారి వద్దకు వెళ్ళి తమకు ఆహారాన్నిచ్చి క్షుద్భాధ తీర్చమని అడిగాడు.వారు ఆయనను ఎంత అన్నం అవసరమౌతుందని పరిహసించారు.బదులుగా బ్రహ్మంగారు "మాకు ఎంత అవసరములే మాకడుపు నిండినంత చాలు" అన్నారు.వారు బ్రహ్మంగారిని అవమానించాలని "అలాకాదు మీరు తక్కువ తింటే ఎలా ఒకపుట్టి బియ్యం వండి వడ్డిస్తాం మీరు అంతా తిని మమ్ములను సంతృప్తి పరచండి" అన్నారు.అందుకు బ్రహ్మంగారు సమ్మతించగా వారు పుట్టెడు బియ్యం వండించి భుజించమని చెప్పారు.అందుకు బ్రహ్మంగారు ఈ పనికి తాను అవసరంలేదని తనశిష్యుడు సిద్దయ్య చాలని అన్నాడు.బ్రహ్మంగారు ఒక్క ముద్ద అన్నం తీసుకుని మిగిలినదానిని తినమని సిద్దయ్యను ఆజ్ఞాపించాడు.సిద్దయ్య అలాగే ఆన్నమంతా తిని ఇంకా కావాలని సైగ చేసాడు.ఇది చూసిన విశ్వబ్రాహ్మణులు నిర్గాంతపోయి తమని క్షమించమని బ్రహ్మంగారిని వేడుకున్నారు.ఆయన చిరునవ్వుతో తనచేతిలోని అన్నాన్ని సిద్దయ్యకు అందించగా అది ఆరగించిన తరవాత అతని ఆకలి తీరింది.విశ్వబ్రాహ్మలు బ్రహ్మంగారికి పూజలు చేసి తత్వబోధ చేయమని కోరారు.ఆయన వారికి జ్ఞానబోధ చేసి అక్కడి నుండి బయలుదేరి అహోబిలం చేరారు.

కడపనవాబు
అహోబిలం శ్రీలక్ష్మీనృసింహుని దర్శనం చేసుకుని అక్కడి నుండి కడప చేరి నవాబుకు కబురు పంపాడు. వెంటనే నవాబు సపరివారంతో వచ్చి స్వాగతం చెప్పి ఆయనను గౌరవంగా తనవెంట తీసుకు వెళ్ళారు. నవాబు బ్రహ్మంగారి మహిమలు చూడాలని ఆసక్తి కనబరిచాడు. ఆయనను మరుసటి నాటి సభకు రమ్మని ఆహ్వానించాడు. బదులుగా బ్రహ్మంగారు చిరునవ్వుతో "నీ మనసులో కోరిక నాకు అర్ధమైంది. నువ్వు అనుకున్నది నేను చేసి చూపగలను " అన్నాడు. నవాబు తన మనసులోని కోరిక ఆయనకు ఎలా తెలిసిందో తెలియక ఆశ్చర్యపడినా మరుసటి నాటి సభకు ప్రజలను రమ్మని చాటింపు వేయించాడు. మరుసటి నాటి సభలో నవాబు బ్రహ్మంగారితో "స్వామీ! నావద్ద ఒక చూడిగుర్రం ఉంది అది ఆడ గుర్రాన్ని కంటుందో మగ గుర్రాన్ని కంటుందో తెలియచేయండి " అన్నాడు. బ్రహ్మంగారు చిరునవ్వుతో ఆ గుర్రాన్ని తెప్పించమని కోరగా గుర్రాన్ని సేవకులు సభకు గుర్రాన్ని తీసుకు వచ్చారు. దానిని చూసి "దీని గర్భంలో నాలుగు తెలుపు రంగు కాళ్ళు ,నొసట చుక్క,పువ్వుల తోక కలిగిన మగ గుర్రం జన్మిస్తుంది" అన్నాడు. ఆ తరవాత నవాబు సందేహం తీరలేదని గ్రహించి "ఆ గుర్రం గర్భంలో ఉన్న శిశువుని చూడటమే నీ ఉద్దేశ్యం అని అర్ధం అయింది. అది చూసే వరకు నాపై నీ సందేహం తీరదు ఔనా" బ్రహ్మంగారు నవాబుతో చెప్పాడు. అంగీకారంగా నవాబు తల ఊపడం చూసి ఆయన గుర్రానికి నలువైపులా తెరను కట్టించి గుర్రం గర్భంలోని శిశువును తీసి నవాబుకు చూపగా అది ఖచ్చితంగా బ్రహ్మంగారు చెప్పినట్లే ఉండటం చూసిన నవాబు ఆశ్చర్యపడ్డాడు.బ్రహ్మంగారు ఆ శిశువును తిరిగి గుర్రం గర్భంలో ప్రవేశపెట్టి గుర్రాన్ని బ్రతికించాడు. నవాబు తన భవిష్యత్తు చెప్పమని బ్రహ్మంగారిని అడిగాడు. కడప నవాబుకు జ్ఞానబోధ చేసే సమయంలో బ్రహ్మంగారు తాను భవిష్యత్ లో తిరిగి జన్మించి రాబోయే విషయాన్ని సూచించారు.

నేను శ్రీ వీరభోజ్యుడినై ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను. కలియుగం 5000 సంవత్సరములు గడిచిన తరవాత దుష్ట శిక్షణ శిష్ట రక్షనార్ధం వస్తాను. నేను వచ్చే ముందు సంభవించే పరిణామాలు విను.
ఉప్పుకొడూరులో ఊరచెరువులో ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించి పోతారు.
14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనం.
నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు.
5972 ధాతు నామ సంవత్సరాన మాఘ శుద్ధ బుధవారం రోజున పట్ట పగలే 18 పట్టణాలు దోపిడీకి గురౌతాయి.
కోటిదూపాటిలో కొచ్చర్లకోటలో కోడి మాట్లాడుతుంది. జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ము దిగమ్రింగి అబద్ధాలాడి బాకీలు ఎగకొడతారు.
కోమటి కులంలో 25 గోత్రాలవారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు.
మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.
పట్ట పగలు ఆకాశంలోనుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.
పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది.
బనగాన పల్లెలో కాలజ్ఞాన పాతర మీద వేపచెట్టుకు చేమంతిపూలు పూస్తాయి.
గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగాన పల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు.ఆ తరవాత బనగాన పల్లెను ఇతరరాజులు స్వాధీనపరచుకుంటారు.
అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది.అందువల్ల ఎందరో నష్టపోతారు.
గోలుకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణం ఏలుతారు.
మహానంది మరుగున మహిమలు పుడతాయి.
నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను. నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు. మూఢులు మాత్రం నమ్ముతారు.
మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు అరికాలున తామరపద్మం కలిగినవారు వస్తారు. వారిని చూసి నేనని భ్రమపడవద్దు. నారాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ పల్లెలో నవరత్న మండపం కడతారు. ఆ పల్లెపెరిగి పట్టణంగా మారుతుంది.
కంచి కామాక్షమ్మ కన్నులవెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తరవాత వందలాది మంది మరణిస్తారు.
ఆవు కడుపులోని దూడ అదేవిధంగా బయటకు కనిపిస్తుంది.
పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు.
కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడను పేర శైవుడు జన్మించి మతబేధం లేక గుడులూ గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామ దేవతలు ఊగిసలాడతారు.
కాశీ కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గి పోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది.
ఆనంద నామ సంవత్సరాలు పదమూడు గడిచేవరకూ ఈ నిదర్శనాలు కనిపిస్తుంటాయి.
పతివ్రతలు పతితలౌతారు. వావి వరసలు పాటించకుండా ప్రవర్తిస్తారు. ఆచారాలన్నీ సమసి పోతాయి.
రాయలవారి సింహాసనం కంపిస్తుంది. కురుమ సంతతి రాజులందరినీ జయించి దక్షిణంగా బోయి రామేశ్వరం దిక్కున రాయల దళాలను తరిమి యుద్ధాలు చేసి నర్మదానదిలో కత్తులు కడిగి కాశీకి వచ్చి రాయల తల చూస్తారు. ఈ సమయంలో హస్థినాపురిలో మహామారి అనేశక్తి పుడుతుంది. రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది.
శ్రీశైల క్షేత్రాన కల్లు, చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. మందుమాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి. స్త్రీ పురుషులంతా దురాచార పరులౌతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు.
ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు.
వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గి పోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలుతాయి. బెండ్లు మునుగుతాయి. చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది.
విజయనగరాన కోటలో రాయల సింహాసనం బయట పడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామంలో రాతి విగ్రహాలు ఊగిసలాడతాయి. అప్పుడు బిజ్జల రాయుని కొలువులో రాయలసింహాసనం బయట పడుతుంది.
ఇలా బ్రహ్మంగారు కడపనవాబుకు కాలజ్ఞానంబోధించి, మంత్ర దీక్ష ఇచ్చి ఆశీర్వదించాడు.

పుష్పగిరి
నేను కలియుగం 5,000 సంవత్సరంలో వీరభోగవసంత రాయలుగా దుష్ట శిక్షణా, శిష్టరక్షణార్ధం భూమిపై అవతరిస్తాను. మార్గశిర మాసంలో దక్షిణభాగంలో ధూమకేతువనే నక్షత్రం ఉదయించి అందరికీ కనపడుతుంది. క్రోధినామ సంవత్సరమున మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో నేను అవతరించే సమయంలో దక్షిణాన ఒక నక్షత్రం పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి.
నాలుగు వర్ణాలు మధ్యపానంతో భ్రష్టులౌతారు.
వేదములు అంత్య జాతుల పాలౌతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్థుల పంచన చేరుతారు. విప్రులు విధవా వివాహాలు చేస్తారు. స్వవృత్తి, ధర్మాలు మాని ఇతరులకు బానిస వృత్తి చేస్తారు.
బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు. బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంటభూములు అమ్ముకుంటారు. నేను వచ్చేసరికి వారికి తిండి గుడ్డ కరువు ఔతాయి. మీనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంత రాయలుగా ఉద్భవిస్తాను. నాలుగు మూరల ఖడ్గం చేత పట్టి శ్రీశైల పర్వతం మీదకు వచ్చి అక్కడి ధనం అంతా పుణ్యాత్ములైన వారికి దానం చేస్తాను.
నేను భూమి మీదకు ఎలా వస్తానో మరొకసారి చెప్తాను వినండి. కేదారి వనంలో నిరాహారినై జపము చేస్తాను. మూడు వరాలు పొంది అక్కడి నుండి విక్రమ నామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకుని తపసు చేసి అక్కడ మహామునులను, మహర్షులను దర్శనం చేసుకుంటాను. అటు నుండి బయలుదేరి శ్రీశైలం మల్లిఖార్జునుని సేవించి దత్తాత్రేయుడిని దర్శనం చేసుకుంటాను. మహానందిలో రెండు రోజులుండి అక్కడి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమినాటికి నారాయణపురం చేరుకుని అక్కడ కొంతకాలం నివసిస్తాను.
నేను తిరిగి వచ్చేసరికి జనులు ధనమధాంధులు, అజ్ఞానులై కొట్టుకు చస్తారు.
నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి. పర్వతాలమీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగుల కొడతారు.
కాశీదేశంలో కలహాలు చెలరేగుతాయి.
నేను వచ్చేసరికి విధవావివాహాలు జరగటం మామూలై పోతుంది.
వావి వరసలు లేకుండా వివాహాలు జరుగుతాయి. కుల గోత్రాలు నీతి జాతీ లేని పెళ్ళిళ్ళు జరుగుతాయి. పార్వతీ అవతారాలను డబ్బులకు అమ్ముకుంటారు.
అరణ్యంలోనూ భూమిలోనూ ధనం ఉండేను. నేను భూమిపై పెక్కు దృష్టాంతాలు పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమిపై మంటలు పుడతాయి.
నాలుగు సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. నూట ఇరవై తిరపతులు పాడయ్యేను.
నా రాకకు ముందు అనేక చిత్రములు జరిగేను. శృంగేరి,పుష్పగిరి పీఠములు పంచాననం వారి పాలౌతాయి.
ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది.
హరిద్వారంలోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం తలుపులు మూసుకుంటాయి.
అహోబిలంలో ఉక్కు స్థంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పూస్తాయి.
నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది.
వైశాఖ శుద్ధ పంచమిన నేను బయలుదేరి సూర్యమండలం నుండి కొలువు పాకకు వస్తాను. అక్కడి నుండి అహోబిలం, తర్వాత సూర్యనంది చేరుకుంటాను.
శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4,999 సంవత్సరాలకు కలిరూపం కొంత నాశనం ఔతుంది.
శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ 'గణ గణ'మని గంటలమోత వినబడుతుంది.
బ్రమరాంభ దేవాలయంలో ఒక ముసలి 7 రోజులుండి అదృశ్యం అవుతుంది. బ్రమరాంభ మెడలోని మంగళసూత్రాలు తెగి పడిపోతాయి. ఆమె కంట నీరు కారుతుంది. పాలిండ్లనుండి పాలుకారుతాయి.
కందనూరి గోపాలుని గుడి ముందు చింతచెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయంలో రెండు పాములు తిరుగుతాయి. వాటిలో పెద్ద పాము శిఖరాన మూడు రోజులుండి అదృశ్యమౌతుంది.
సూర్యనందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలుపూచి, కాయలుకాచి,పండ్లు పండి వెనువెంటనే మాయమౌతుంది.
శిరువెళ్ళ నరశింహుని దుట గంగిరావిచెట్టు మొలుస్తుంది. బహుధాన్య నామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తారు.
బసవన్న రంకె వేస్తాడు. తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి. భద్రకాళి కంపస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమట పడుతుంది. కంట నీరు,పాలిండ్ల పాలూ కారుతాయి.
శాలివాహన శకం 1541న ధూమకేతువు పుడుతుంది. 1555నాటికి వివిధ దేశాలలో జననష్టం కలుగుతుంది.
పెమ్మసాని తిమ్మన్న వంశం నిర్వంశమయ్యేను. ఉదయగిరి, నెల్లూరు రూపు మాసి పోయేను. గండికోట, గోలకొండ, ఆదలేని, కందనూరు పట్టణాలు నశించి తురకలు పారి పోతారు. విజయపురంలాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశించేను.
స్త్రీల కంట నెత్తురు బిందువులు రాలుతాయి. వడగండ్ల వాన కురుస్తుంది. బాణవర్షం కురుస్తుంది. బావులూ, చెరువులూ, నదుల నీరు ఇంకినా జజ్జేరు నీరు మాత్రం ఇంకిపోదు.
పంచాననంవారికి జ్ఞానబోధ
మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకు వస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు.
నేను వచ్చేసరికి బ్రాహ్మణులు వర్ణసంకర వృత్తులు చేస్తూ తమ వైభవం కోల్పోతారు. ఏ కులంవారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. సిద్దులూ యోగులూ జన్మించిన ఆ బ్రాహ్మణ కులం పూర్తిగా వర్ణసంకరమౌతుంది.
ఆనాటికి ప్రజలలో దుర్బుద్ధులు అధికమౌతాయి.
కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది.
రాజాధిరాజులు అణిగి ఉంటారు. శూద్రులు వలాసాలను అనుభవిస్తూ రాజుల హోదాలో ఉంటారు. వారి ఇంట ధనలక్ష్మీ నాట్యమాడుతుంది. నా భక్తులైన వారికి నేనప్పుడే దర్శనమిస్తాను. కానివారి నెత్తురు భూమి మీద పారుతుంది. దుర్మార్గుల రక్తంతో భూమి తడుస్తుంది. భూభారం కొంత తగ్గుతుంది.
చీమలుండు బెజ్జాల చోరులు దూరుతారు. స్త్రీలందరూ చెడుతలపుతో ఉంటారు. అందువలన చోరులు ప్రత్యేకంగా కనపడరు. బిలం నుండి మహానంది
పర్వతం విడిచి వెళుతుంది. గడగ్ లక్ష్మీపురం, రాయచూర్, చంద్రగిరి అలిపేది, అరవరాజ్యం, వెలిగోడు, ఓరుగల్లు, గోలుకొండ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చలననేంద్రియములు, ఆయుధాలచేత బాణముల వల్ల నశిస్తారు.

గతజన్మ వృత్తాంతం
ఒకకరోజు సిద్ధయ్య బ్రహ్మంగారితో "స్వామీ! మీరు గతంలో త్రేతా, ద్వాపర యుగంలో కూడా జన్మించానని చెప్పారు. మీ పూర్వ జన్మ వృత్తాంతం నాకు వివరిస్తారా?" అని అడిగాడు. బదులుగా బ్రహ్మంగారు "నా గతజన్మల గురించిన వివరములు రహస్యములే అయినా, నీకు మాత్రం వివరించగలను. అని తన పూర్వ జన్మల గురించి చెప్పడం ప్రారంభించారు.

"బ్రహ్మలోకంలో నేను భైరవుడనే పేరుతో అనేక బ్రహ్మ కల్పాలు రాజ్యపాలన చేసాను. ఆ తరవాత వెండి కొండ మీదకు వెళ్ళి 54 బ్రహ్మ కల్పాలు రాజ్యపాలన చేశాను. అప్పుడే మూడు యోజనాల పొడవైన సింహాసనమును నిర్మించి 290 బ్రహ్మ కల్పాలు విష్ణు సేవ చేశ్శాను. నేను చేసిన సేవలను గుర్తించిన మాధవుడు నాకు 'పంచవిద ముక్తి' అనే వరం ఇచ్చాడు. ఆ తరవాత సిద్ధాంత శిరోమణి ఆనందాశ్రితువు ఆశ్రమం వద్ద అన్ని విద్యలు అభ్యసించి మూడేళ్ళ తరవాత అనేక యోగశాస్త్ర విద్యలను నేర్చుకున్నాను. 12,000 గ్రంధములు పఠించి అందులోని అన్ని మర్మములు గ్రహించాను. వీటి ఫలితంగా నేను అకాలమృత్యువును జయించే శక్తిని సంపాదించాను. ఆ తరవాత నా యోగబలం వలన దివ్య శరీరం ధరించి మూడు వేల బ్రహ్మకల్పాలు చిరంజీవిగా ఉన్నాను. ఆతరవాత నా అవతారముల గురించి వివరముగా తెలుపుతున్నాను విను. మొదట అవతారమెత్తి ఆనందాశ్రితులకు శిష్యుడిగా 99,662 బ్రహ్మ కల్పాలు ఉన్నాను, మూడవ అవతారంలో 1,09,00,000 బ్రహ్మ కల్పాలు ఉన్నాను. నాల్గవ అవతారములో 1,00,01,317 కల్పాలు ఉన్నాను. అయిదో అవతారంలో 4కోట్ల పదఞాలుగు లక్షల 55 వేల బ్రహ్మకల్పాలు ఉన్నాను. ఆరవ అవతారంలో ఆరు వందల బ్రహ్మ కల్పాలు ఉన్నాను. ఏడవ అవతారంలో 27,63,03,400 బ్రహ్మ కల్పాలు జీవించాను. ఎనిమిదో అవతారంలో 22,60,000 బ్రహ్మ కల్పాలు ఉన్నాను. పదవ అవతారంలో కనిగిరిలో ఉన్నాను ఆ జన్మలో 70 లక్షల బ్రహ్మ కల్పాలు జీవించాను. ఇప్పుడు బనగాన పల్లెలో వీరప్పయాచార్యుడనై 125 సంవత్సరములు తపసు చేశాను. వీరబ్రహ్మేంద్ర స్వామిగా మొత్తం 175 సంవత్సరములు జీవించి జీవసమాధి పొందుతాను."

నేను చనిపోయేలోగానే హరిహరరాయలు మొదలు రామరాయల వరకు చరిత్ర అంతమౌతుంది.
ఆ తరవాతకాలంలో ఈ అఖండం మహమ్మదీయుల వశమౌతుంది.
శ్వేతముఖులు భరతఖండాన్ని పాలిస్తారు.
పల్నాటిసీమలో నరులు పచ్చి ఆకులు తిని జీవిస్తారు.
మొగలాయి రాజ్యాన ఒకనది పొంగి చేలు నాశనమైన రీతిగా జనాన్ని నశింపచేస్తుంది.
వ్యభిచార వృత్తి అంతరించి పోతుంది. ఆ వృత్తిలోని వారు వివాహం చేసుకుని కాపురం చేస్తారు.
గురువులు ఆడంబరంగా జీవిస్తారు.
కుటుంబంలో సఖ్యత ఉండదు. తల్లి, తండ్రి, పిల్లలు మద్య వాత్సల్యాలు ఉండవు. ఒకరిని ఒకరు మీద ఒకరికి నమ్మకం నశిస్తుంది.
నారాకకు ముందు నా భక్తులు వారి శక్త్యానుసారం నాధ్ర్మ పాలనకు అంకురార్పణ చేస్తారు. అని సిద్ధయ్యకు బ్రహ్మంగారు వివరించాడు.
కర్నూలు నవాబుకు జ్ఞానబోధ
క్రోధనామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీరభోగ వసంతరాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశనకరమైన గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది.
చండిపూర్,అలంపూర్ స్థలములలో ఉత్పాతములు పుడతాయి. ఆ ప్రాంతంలో పాలెగాళ్ళు తమలో తాము కలహించుకుని చెడి భ్రష్టులై పోతారు.
నలు దిక్కులయందు దివ్యమైన నక్షత్రాలుపుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి.
అమావాస్య రోజున పున్నమి చంద్రుని చూసిన జనులు నశిస్తారు. నిజమని నా మహిమను తలచుకుంటారు.కార్తీక శుద్ధ ద్వాదశినాటికి విష్ణుభక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది.
తూర్పున శిరసు పడమర తోకగా ఇరువది బారల ధూమకేతువనే నక్షత్రం పుడుతుంది. పుట్టిన ముప్పై రోజుల వరకు అందరికి కనిపిస్తుంది. ఆకాశం ఎర్రపడుతుంది. ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్ధాలు పుడతాయి.
ఈశ్వరమ్మని రంగరాజుకు ఇచ్చి వివాహం చేసే నాటికి నవరత్న మండపాలతో పన్నెండామడల పట్నం ఔతుంది. నా భక్తులు యావన్మంది ఇక్కడకు వచ్చి కల్యాణం చూస్తారు. అదే మీకు నిదర్శనం. ఈ కాలజ్ఞానం విని నవాబు బ్రహ్మంగారికి అనేక బహుమతులిచ్చి సత్కరించాడు.
కరున ఘ్గ్ఝ

పుత్రుడు గోవిందాచార్యులకు జ్ఞానబోధ
బ్రహ్మంగారు తన పుత్రుడు గోవిందాచారిని పిలిచి "నాయనా నేను వచ్చి 175 సంవత్సరాలు గడిచాయి.ఇప్పటి వరకూ కలియుగంలోని సామాన్య ప్రజల మనసుని జ్ఞానంవైపు మళ్ళించి పరబ్రహ్మ ఉపాసకులుగా మార్చగలిగాను.ఇకపై ఈ భాద్యత నీది.వీరిని ఎలా మార్చుకుంటావో నీ ఇష్టం.నేను జీవ సమాధిలోకి ప్రవేసిస్తాను.నీకొక రహస్యం తెలియచేస్తున్నాను.నీ గర్భవాసంలో పరమేశ్వరియే జన్మిస్తుంది.ఆమె భూత,వ్ర్తమాన,భవిష్యత్ చెప్పగలిగిన మహాజ్ఞాని.ఇక్కడి మూఢులకు అజ్ఞానం తొలగించి జ్ఞానదీపం వెలిగిస్తుంది.ఆమె మహిమలు చూపిస్తుంది.ఆమె వాక్కులు ఫలిస్తాయి.చివరికామె నావలె సమాధి నిష్టను పొందుతుంది.ఆమెకు నావలె మఠములుంటాయి.ఆమెకు నావలె పూజలుంటాయి.ఆ మహాదేవిని ఈశ్వరమ్మ అని పిలుచుకోవాలి.ఇక సిద్ధుడు ఈశ్వరాంశ సంభూతుడు.అతడు క్షత్రియుల ఇంట పుట్టి గోహత్య చేసి మహమ్మదీయుల ఇంట జన్మించాడు.ఆ గోహత్య పరిహారార్ధం నా శిష్యుడయ్యాడు.అతడు ఈ లోకాన్ని విసర్జించిన జ్ఞానయోగి.అతడికి అద్వైత విషయంలో ఆసక్తి కలిగి సిద్ధిని పొందాడు.అందుకే అతనికి సిద్ధుడని నామకరణం చేసి నా ప్రధమ శిష్యుని చేసిీన్ని విషయాలను తెలియచేసాను." అని ముగించాడు.

భార్య గోవిందమ్మకు జ్ఞానబోధ
వైశాఖ శుద్ధ దశమి అభిజిత్ లగ్నం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సమాధి కాలం నిర్ణయించాడు. ఇది విని విలపిస్తున్న గోవిందమ్మను పిలిచి "నాకు మరణం లేదు నీకు వైధవ్యంలేదు. నీవు సుమంగళిగా జీవించు. నేను సమాధినుండి వీరభోజ వసంతరాయలుగా వచ్చి నాభక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను వచ్చే వరకు ఏమేమి జరుగుతాయో నీకు జ్ఞానబోధ చేస్తాను" అని బ్రహ్మంగారు చెప్పాడు.

బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది.
మాహాలక్ష్మమ్మ నృత్యంచేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది.
కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపుడక తాకుతుంది.
కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది.
కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది.
అచ్చమ్మ వంశం సర్వనాశనమై వారి వంశం అంతరించి పోతుంది.
నారాయణమ్మ వంశస్తులు మఠాధిపతులౌతారు. నీవు ఇకనైనా ఈ బ్రాంతిని విడిచిపెట్టు. అనిచెప్పి గోవిందమ్మ దు॰ఖాన్ని పోగొట్టాడు.
సమాధి తర్వాత దర్శనం
సిద్దయ్యను పూలు తీసుకురమ్మని బనగాన పల్లెకు పంపి బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్ళాడు. సిద్ధయ్య తిరిగి వచ్చి గురువు కోసం విపరీతంగా విలపించ సాగాడు.బ్రహ్మంగారు శిష్యునిపై కరుణించి సమాధిపై రాతిని తొలగించమని ఆదేశించి రాతిని తొలగించిన తరవాత బటికి వచ్చి సిద్ధయ్యను ఓదార్చాడు. ఆ పై సిద్దయ్య కోరికపై పరిపూర్ణం ను బోధించాడు. ఆ తరవాత సిద్ధయ్యకు దండం, కమండలం, పాదుకలు మరియు ముద్రికను ఇచ్చి తిరిగి సమాధిలో ప్రవేసించాడు.

కందిమల్లయపాలెం చింతచెట్టు
కందిమల్లయ పాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు ఆయనచే వ్రాయబడిన 14,0000 కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటి ఉంచాడు. ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు, ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింతచెట్టు పూలు అన్నీ రాలిపడతాయని అక్కడి ప్రజల విశ్వాసం. ఆచెట్టు పంలగలో ఎర్రటి రక్తంలా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆరినప్పుడు కుంకంలా ఉంటుంది. వ్యాధులు మరియు ప్రమాదాలు నివారణ కొరకు దానిని స్వీకరిస్తుంటారు. ఆ చెట్టు అక్కడి ప్రజలందరికీ సుపరిచితమే. ఆ చింతచెట్టుకు నిత్యదీపారాధన చేస్తూ ఉంటారు. ఆ చింత చెట్టు కాయలు లోపల నల్లగా తినడానికి పనికిరానివై ఉంటాయి.

1 comment:

  1. నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు

    this happened when a volcano has busted in ICELAND

    ash cloud has been came for about 1 1/2 month

    airlines where also canceled

    ReplyDelete